రైతులకు బెస్ట్ స్కీం..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

రైతులకు బెస్ట్ స్కీం..!
– రూ. 1లక్ష నుంచి 5లక్షల వరకు లోన్
– ఎరువులు, విత్తనాలపై రాయితీ కూడా
– కార్డు ఉన్న వారందరికి బీమా వర్తింపు

– ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
దర్శిని డెస్క్ : రైతులను ఆదుకునేందుకునేందుకు కేంద్రం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. తద్వరా రైతులు అనేక ప్రయోజనాలను పొందుతున్నారు. ఎన్నో పథకాలు ఉన్నా కూడా రైతులకు ఇంకా మేలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రం కిసాన్ క్రిడిట్ కార్డులను అందజేస్తూ వ్యవసాయానికి అండగా నిలుస్తోంది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకాన్ని 1998లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

ఈ క్రెడిట్‌ కార్డులను ఉపయోగించుకుని వ్యవసాయం సహా మత్స్య, పశుసంవర్థక రంగాల్లో స్వల్పకాలిక రుణాన్ని పొందవచ్చు. ఈ కార్డుల ద్వారా వ్యవసాయ సహా ఇతర అనుబంధ కార్యకలాపాలైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల కొనుగోలు, కూలీల ఖర్చు, పంట కోత ఖర్చులు వంటి అవసరాల కోసం ఈ కార్డు ద్వారా లోన్‌ తీసుకోవచ్చు. కిసాన్​ క్రెడిట్​ కార్డు ద్వారా తీసుకున్న లోన్​లకు 7 శాతం వడ్డీ వర్తిస్తుంది. ఇందులో రూ.లక్షలోపు లోన్​లకు 3 శాతం రాయితీని కేంద్రం ఇస్తే 4 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అంటే రూ.లక్షలోపు లోన్​లకు సున్నావడ్డీ, రూ.లక్ష నుంచి రూ.5 లక్షల్లోపు రుణాలకు సంబంధించి పావలా వడ్డీ ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే…
19-69 ఏళ్ల వయసు వారు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు తీసుకోవడానికి అర్హులు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి లేదా నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు వెబ్‌సైట్‌లో అప్లై చేసుకొని కార్డును పొందే వీలుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తును బ్యాంకులో అధికారులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కావాలనుకునే రైతులు.. తమ అకౌంట్‌ ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేటు బ్యాంకును సంప్రదించాలి. అక్కడ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు దరఖాస్తు ఫారమ్‌ తీసుకుని.. అందులో పేర్కొన్న వివరాలను నమోదు చేయాలి. ఐడీ ప్రూఫ్‌ కింద ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డు, పాస్‌పోర్టుల్లో ఏదో ఒకటి చూపించాలి. దీనితో పాటు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, వ్యవసాయ భూమి పత్రాలను ఆ దరఖాస్తు ఫారమ్‌కు జత చేసి బ్యాంకులో సమర్పించాలి. అప్పుడు సంబంధింత బ్యాంకులు ఆ వివరాలను సరిచూసుకుని.. ఐదేళ్ల కాలపరిమితితో కూడిన కిసాన్‌ క్రెడిట్‌ కార్డును మంజూరు చేస్తుంది.
kvcs

కిసాన్​ క్రెడిట్​ కార్డు ప్రయోజనాలు
బ్యాంకులో పంట రుణం(క్రాప్​ లోన్​) తీసుకున్నపుడు మంజూరు చేసిన మొత్తాన్ని రైతు పొదుపు అకౌంట్​కు జమ చేస్తారు. అప్పటి నుంచి తిరిగి చెల్లించే వరకు వడ్డీని లెక్కిస్తారు. కానీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డుంటే ఈ అకౌంట్​లోనే పంట రుణం మొత్తం జమవుతుంది. కార్డు ద్వారా ఎన్ని డబ్బులు వినియోగిస్తే అంత మొత్తానికి మాత్రమే వడ్డీ పడుతుంది. ఇప్పటికే ఏటీఎం కార్డు ఉంటే దాన్ని కిసాన్‌ క్రెడిట్‌కార్డు అకౌంట్​కు లింక్‌ చేయించుకుంటే కార్డును సాధారణ ఏటీఎంగా, కిసాన్‌ క్రెడిట్‌ కార్డుగానూ ఉపయోగించుకోవచ్చు. లావాదేవీలు జరిపినపుడు రెండు అకౌంట్లు కనిపిస్తాయి. ఒకదాన్ని ఎంచుకొని డబ్బు వెచ్చించవచ్చు. క్రెడిట్‌ కార్డు ద్వారా అదనంగా కేంద్రం నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లోన్​ను పొందవచ్ఛు పావలా వడ్డీ, సురక్ష బీమా యోజన వర్తిస్తాయి.

ఇదికూడా చదవండి…

యాలకుల టీ.. బెటర్‌..!