సర్ సూపర్ సక్సెస్..!
– తాండూరులో నాలుగు గ్రామాల్లో 100శాతం పూర్తి
– హర్షం వ్యక్తం చేసిన కన్వినర్ కరణం పురుషోత్తం రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత ఎన్నికల సంఘం చేపట్టిన జాతీయ ఓటర్ల సమగ్ర సవరణ(సర్) తాండూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో సూపర్ సక్సెస్ అయ్యింది.

రెండు మండలాల్లోని నాలుగు గ్రామాలు 100శాతం డిజిటలైజేష్ పూర్తి చేసుకుంది. సర్ పూర్తిపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సర్ తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కరణం పురుషోత్తం(కేపీ) రావులు హర్షం వ్యక్తం చేశారు. గత నెల 25వ తేది నుంచి సర్ కార్యక్రమం ప్రారంభమైంది. బీఎల్ఓలు, పార్టీల నుంచి బీఎల్ఏలు ఓటర్ల సమగ్ర సవరణ కోసం ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికి అందజేశారు.

ఓ వైపు ఫారాల స్వీకరణ జరుగుతుండగానే మరోవైపు డిజిటలైజేషన్ కూడా కొనసాగుతోంది. తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం అచ్చుతాపూర్లోని పోలింగ్ స్టేషన్ 187తో, జక్కెపల్లిలోని పోలింగ్ స్టేషన్ 205లో సర్ డిజిటలైజేషన్ పూర్తి అయ్యింది. అదేవిధంగా బషీరాబాద్ మండలం గంగ్వార్లోని పోలింగ్ స్టేషన్ 262, కుప్పన్ కోట్ లోని పోలింగ్ స్టేషన్ 226లో సర్ ఫారాల డిజిటలైజేషన్ 100శాతం పూర్తి అయ్యింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా తాండూరు సర్ కన్వీనర్ కరుణం పురుషోత్తంరావు మాట్లాడుతూ బీఎల్ఓలు, బీఎల్ఏలతో పాటు పార్టీ నేతల సహాకారంతో నాలుగు గ్రామాల్లో డిజిటలైజేషన్ 100శాతం పూర్తి కావడం సంతోషకరం అని అన్నారు. అందరి సమిష్టి కృషి, అంకితభావంతో తాండూర్ నియోజకవర్గంలో సర్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని అన్నారు. నియోజకవర్గం మొత్తం త్వరగా 100శాతం పూర్తి చేసి తాండూరును అగ్రస్థానంలో నిలబెట్టుకుందామని పిలుపునిచ్చారు.


