వామ్మో.. ఒమిక్రాన్..!
– కొత్త వైరస్పై అప్రమత్తం
– మాస్కులు, వ్యాక్సీనేషనే రక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి: అటు పోయిన యేడాది.. పోయిన యేడాది కరోనా కొత్త వైరస్ అంటూ దేశ ప్రజలంతా బెంబేలెత్తిపోయారు. రెండో దశ తగ్గుముఖం తరువాత జనం రోడ్లపైకి వచ్చారు. ఇంకెక్కడి కరోనా అంటూ మాస్కుల్లేకుండా విచ్చల విడిగా తిరిగారు. శానిటైజర్, వ్యాక్సీనేషన్లపై పట్టింపును వదిలేశారు. మూడో దశ వస్తోందంటూ ప్రచారం చేసినా పట్టన్నట్లు ఉండిపోయారు. ఇదంతా నిన్నమొన్నటి వరకే. ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ రావడంతో అందరిలో వణుకు ప్రారంభమయ్యింది. మూడు రోజుల్లో మూడు దేశాల నుంచి 24 దేశాలకు విస్తరించిన ఈ కొత్త వైరస్ భారత దేశంలోకి ప్రవేశించడంతో దెబ్బకి వామ్మో.. ఒమిక్రాన్ అంటూ వణుకు జపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ప్రజలంతా మాస్కులు, రెండు డోసుల వ్యాక్సీనేషనే శ్రీరామ రక్ష అంటూ చైతన్య పరుస్తున్నారు.
తాండూరులో ముమ్మరంగా పరీక్షలు, వ్యాక్సీనేషన్
ఒమిక్రాన్ విస్తరణ నేపథ్యంలో తాండూరులో కరోనా పరీక్షలు, వ్యాక్సీనేషన్ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రతిరోజూ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మొదటి, రెండో డోస్ వ్యాక్సీనేషన్ పంపిణీని కొనసాగిస్తున్నారు. వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా సిబ్బంది 18 ఏండ్లు నిండిన వారికి టీకాలను వేస్తున్నారు. వ్యాక్సీనేషన్ పంపిణీకి అధికారులు డోసులను నిల్వ ఉంచుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.

నిలకడగా కరోనా కేసులు
తాండూరు నియోజకవర్గంలో కరోనా కేసులు నిలకడగా నమోదవుతున్నాయి. తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో ప్రతిరోజూ రాట్, ఆర్టీపీసీఆర్ విధానాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజూ దాదాపు 25 నుంచి 80కి పైగా పరీక్షలు చేసి పాజిటివ్, నెగిటివ్ కేసులను నిర్దారిస్తున్నారు. తాండూరు పట్టణంతో వివిధ మండలాలకు చెందిన ప్రజలు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటున్నారు. గత నెలలో జిల్లా ఆసుపత్రిలో జరిపిన పరీక్షల్లో 3 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ నెలలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడ నమోదు కాలేదు. దీంతో తాండూరు కరోనా కేసులు నిలకడగా ఉన్నాయి.
మాస్కు పెట్టకపోతే..
కరోనాతో పాటు ఒమిక్రాన్ వైరస్ నుంచి రక్షణ పొందాలంటే మాస్కు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
కరోనా మొదటి, రెండో దశల కంటే ఒమిక్రాస్ వైరస్ భిన్నమైన స్వభావాలు కలిగి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్కు పెట్టుకోకపోతే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు ప్రజలు మాస్కు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం జీఓ జారీచేసింది. మాస్కు ధరించకపోతే రూ. 1వేయ్యి జరిమాన విధించాలని వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మాస్కు ధరించక పోతే ఆరోగ్యంతో పాటు జేబుకు చిల్లుపడడం ఖాయం.
ఈ జాగ్రత్తలు పాటించాలి
కరోనాను ఏలా కట్టడిగా ఎదుర్కొన్నారో.. ఒమిక్రాన్ నుంచి కొన్ని ముందుజాగ్రత్తలు, కట్టడి చర్యలతో అదుపుచేయొచ్చని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు పోలీసు, ప్రభుత్వ శాఖల అధికారులు పేర్కొంటున్నారు. జలుబు, జ్వరం లక్షణాలు ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. వ్యాక్సీనేషన్ వేసుకోని వేసుకోవాలని చెబుతున్నారు. ఫంక్షన్లు, పండగల్లో కరోనా నిబంధనలు పాటించడం మంచిందంటున్నారు. వృద్ధులు, ఇతర రోగాలు ఉన్న వారు అన్ని జాగ్రత్తలను పాటించాలని సూచిస్తున్నారు.

