రేపటి నుంచి వాట్సాప్ బంద్..!
– కొత్త ఏడాది నుంచి సేవలు నిలిపివేత
– పాత మాడల్స్ ఫోన్లలో మాత్రమే
దర్శిని డెస్క్: వివిధ రకాల ఆఫ్డేట్లను అందిస్తూ దూసుకపోతున్న వాట్సాప్ సేవలు బంద్ కాబోతున్నాయి. అన్ని ఫోన్లలో కాకుండా కొన్ని ఫోన్లలో మాత్రమే సేవలను నిలిపివేస్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. వాట్సాప్ వ్యవస్థలో సాఫ్ట్వేర్ అప్డేట్, భద్రతాపరమైన లోపాల కారణంగా వాట్సాప్ కొత్త ఏడాది నుంచి స్మార్ట్ఫోన్లలో తన సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. తమ సాంకేతికతకు అనుకూలంగా లేని స్మార్ట్ఫోన్ల (Smartphones)కు తన సేవలను నిలిపివేస్తుంది. 49 రకాల స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సపోర్టును ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఈ జాబితాలో ఐఫోన్ 5, 5సీతోపాటు శాంసంగ్ గెలాక్సీ సిరీస్లో కోర్, ఎస్2, ఎస్3 మినీ, ట్రెండ్ 2, ట్రెండ్ లైట్, ఎక్స్కవర్ 2, ఏస్2 మోడల్స్ ఉన్నాయి. ఇవికాకుండా హెచ్టీసీ డిజైర్, లెనోవా ఏ820, క్వాడ్ ఎక్స్ఎల్, ఎల్జీ ఎనాక్ట్, ఎల్జీ లూసిడ్ 2 మోడల్స్తోపాటు ఎల్జీ ఆప్టిమస్ సిరీస్, సోనీ ఎక్స్పిరీయా ఆర్క్ ఎస్, ఎక్స్పిరీయా మిరో, ఎక్స్పిరీయా నియో ఎల్, ఆర్కోస్ 53 ప్లాటినమ్, గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్ జెడ్టీఈ, గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987 జెడ్టీఈ, వికో సింక్ ఫైవ్, వికో డార్క్నైట్ జెడ్టీ మోడల్స్లో డిసెంబరు 31 తర్వాత వాట్సాప్ పనిచేయదని తెలిపింది. యూజర్లు ఈ మార్పును గమనించాలని కోరింది. డిసెంబరు 31 తర్వాత నుంచి వాట్సాప్ కొత్త విడుదల చేసే ఫీచర్, సెక్యూరిటీ అప్డేట్లు ఇకపై ఆయా ఫోన్లకు రావని తెలిపింది. ఇటీవలే వాట్సాప్ స్టేటస్ అప్డేట్ రిపోర్ట్ అనే ఫీచర్ను పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు ఇతరులు స్టేటస్పై ఏవైనా అభ్యంతరాలు ఉన్నా, అనుమానాస్పదంగా ఉన్నా వాట్సాప్కు ఫిర్యాదు చేయొచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ను త్వరలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. కావున ఇప్పటికీ ఈ ఫోన్లను ఎవరైనా ఉపయోగిస్తుంటే కొత్త ఫోన్ కొనుగోలు చేయడం లేదా వాట్సాప్ వినియోగం ఆపేయడం మినహా మరో మార్గంలేదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

