రిజిస్ట్రర్లో పాజిటివ్.. రిపోర్టులో నెగిటివ్..!
– తికమకగా కరోనా నిర్దారణ పరీక్షల రికార్డు
– జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది తీరుపై విమర్శలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: జ్వరమొచ్చినా.. జలుబొచ్చినా.. కరోనానేమో అని ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అనుమానం వచ్చిన వారంతా ఆసుపత్రులకు పరుగులు తీసి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేని పేదలు జిల్లా ఆసుపత్రుల వద్ద పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటున్న వారితో వైద్య సిబ్బంది తెలిసో.. తెలియకో.. చెలగాటమాడుతున్నారు. కరోనా నిర్దారణ పరీక్షలకు వచ్చిన వారికి రిపోర్టులో నేగిటివ్ అని రసీదు చేతికిచ్చి.. రికార్డులో పాజిటివ్ అనే నమోదు చేసుకుంటున్నారు. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.
రెండు రోజుల క్రితం తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకున్నారు. పరీక్షల తరువాత అతని చేతికి నెగిటివ్ వచ్చిందని రిపోర్టు అందించారు. కాని అతని పేరుపై మాత్రం ఆసుపత్రి రికార్డులో పాజిటివ్ అని నమోదు చేసుకున్నారు. ప్రతిరోజూ మీడియాకు వెల్లడించే వివరాలలో ఒక పాజిటివ్ కేసు నమోదయ్యిందని రావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. తనకు నెగిటివ్ అని ఇచ్చారని, రికార్డులో పాజిటివ్ నమోదు చేసుకోవడం తెలియడంతో బాధితులు సైతం ఆందోళనకు గురయ్యాడు. ఇలా జిల్లా ఆసుపత్రిలో కరోనా నిర్దారణ పరీక్షలు తికమక నెలకొనడం పట్ల వైద్య సిబ్బందిపై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేసేవిధంగ వ్యవహరించరాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

