సీఎం కేసీఆర్కు అస్వస్థత
– యశోధ ఆసుపత్రికి తరలింపు
దర్శిని ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు. రెండు రోజులుగా నీరసంగా ఉండడంతో పాటు ఎడమ చేతు లాగుతుందని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఆసుపత్రి వైద్యులు సీఎం కేసీఆర్కు పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వ్యక్తిగత డాక్టర్ శ్రీ ఎం.వి.రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారికి ప్రతి ఏటా ఫిబ్రవరిలో పరీక్షలు చేస్తుంటాం. రెండు రోజులుగా బలహీనంగా ఉన్నట్లు చెప్పారు. సాధారణ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ముందు జాగ్రత్తగా మరికొన్ని పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. రొటీన్ పరీక్షల్లో భాగంగానే సీఎం గారికి సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ చేస్తున్నామన్నారు. ఈ పరీక్షల ఫలితాలను బట్టి ఏంచేయాలో చూస్తామన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నారని తెలిపారు. ఇది కేవలం ముందుజాగ్రత్తతో చేస్తున్న పరీక్షలు మాత్రమేనని అన్నారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి, కుమార్తె, మనుమడు, ఎంపీ సంతోష్ ఉన్నారు. మరోవైపు నేడు సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అస్వస్థత కారణంగా సీఎం పర్యటన రద్దు అయ్యింది.

