తిరుపతి సమీపంలో భూకంపం
– భయాందోళన చెందిన ప్రజలు
– ప్రాణాపాయం లేదన్న శాస్త్రవేత్తలు
దర్శిని డెస్క్: ఆంద్రాలోని తిరుపతి సమీపంలో స్వల్ప భూప్రకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూకంపనలు చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఆదివారం తెల్లవారుజామున 1.10 గంటల సమయంలో తిరుపతికి సమీపంలోని ప్రాంతాల్లో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్కాలజీ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం తిరుపతి నగరానికి 85 కిలో మీటర్ల దూరంలో, భూఅంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.6గా నమోదు అయింది. అర్థరాత్రి సమయంలో భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకపోవడం అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

