భద్రేశ్వర జాతరపై నిఘా..!
– సీసీ కెమెరాలు, భారీ బందోబస్తు
– అమల్లోకి ట్రాఫిక్ ఆంక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: రెండేళ్ల తరువాత తాండూరు పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలలో నిఘాతో పాటు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ చర్యలను చేపడుతున్నారు. జాతర ఉత్సవాలలో అడుగడుగుగా సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతున్నారు. మహిళలపై ఎలాంటి దాడులు జరగకుండా షీటీం బృందాన్ని నియమించారు. అదేవిధంగా 3 డీఎస్పీలు, 15 మంది సీఐలు, 30 ఎస్ఐలను, 270 మంది వరకు బందోబస్తు కోసం బాధ్యతలు అప్పగించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు జాతర ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని దేవాలయానికి వచ్చే అన్ని మార్గాలలో ట్రాఫిక్ అంక్షలను విధించారు. జాతరలోకి ఎలాంటి వాహనాలకు రాకుండా చర్యలు తీసుకున్నారు.


