అక్రమ ఇసుక రవాణాకు కళ్లెం..!
– జిల్లాలో 7 చెక్పోస్టులు, 2 ఫ్లయింగ్ స్వ్కాడ్ టీంల ఏర్పాటు
– సరిహద్దు ప్రాంతాల్లో పకడ్బందీగా కట్టడి చర్యలు
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల ప్రత్యేక చొరవ
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు కళ్లెం పడనుంది. జిల్లా కలెక్టర్ కె.నిఖిల ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 7 చెక్పోస్టులు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశారు. జిల్లాలో సాండ్ కమిటి ఆధ్వర్యంలో ఈ బృందాలు పనిచేయనున్నాయి. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల నుంచి ఏర్పాటు చేసిన ఈ బృందాలు జిల్లాలో ఎక్కువగా అక్రమంగా ఇసుక తరలించే ప్రాంతాలను గుర్తించి రవాణాను అరికడాతాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని పెద్దేముల్, తాండూరు, బషీరాబాద్ మండలంలోని ప్రధాన చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పెద్దేముల్ మండలంలోని కొండాపూర్, రేగొండి, తాండూరు మండలంలో పాత తాండూరు, ఖాంజాపూర్, వీర్శెట్టిపల్లి, బషీరాబాద్ మండలంలో నావంద్గి, గంగ్వార్ ప్రాంతాలలో ముఖ్యమైన చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని చెక్ పోస్టుల మీదుగా అక్రమ ఇసుక రవాణా సాగకుండా కట్టుదిట్టిమైన చర్యలను జిల్లా కలెక్టర్ చేపట్టారు. చట్ట విరుద్దంగా ఇసుకను తరలించే వాహనాలపై, సంబంధికులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇప్పటికే హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన చెక్పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఏ విధంగా పనిచేస్తాయో వేచిచూడాలి.

