సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం

తాండూరు రాజకీయం వికారాబాద్

సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం
– రెండేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గానికి కొత్త రూపు
– ప‌ల్లె ప్ర‌గ‌తిలో ప్ర‌జా సంక్షేమానికి పెద్ద‌పీట‌
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– తాండూరు మండ‌లంలో ఎమ్మెల్యే ప‌ర్య‌ట‌న
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : సంక్షేమం, అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయ‌మ‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాండూరు మండల పరిధిలోని మిట్టబాస్పల్లి, గుంతబాస్పల్లి, ఐనెల్లి, కోట్బాస్పల్లి, కోత్లాపూర్, మల్కాపూర్, జిన్గుర్తి గ్రామాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రూ.1 కోటి.28లక్షలు విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మిట్టబాస్పల్లిలో నిర్మించిన వైకుంఠధామాన్ని, గుంతబాస్పల్లి గ్రామంలో సీసీ రోడ్ల తో పాటు గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలకు తెలంగాణ స‌ర్కారు పెద్దపీట వేసింద‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కోసం ఎదురుచూపులు ఉండేవనీ, తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ వచ్చాక అన్నీ రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామ‌న్నారు. రైతుల‌ను రాజులుగా మార్చేందుకు రైతుబంధు, రైతుబీమా, పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌ల‌ను క‌ల్పిస్తుంద‌న్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే దళితబంధును కూడ అమ‌లు చేస్తుంద‌న్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల రూపురేఖలు మారిపోయాయ‌న్నారు. మ‌హాత్మ‌ గాంధీజీ స్ఫూర్తితో పల్లె, పట్టణ ప్రగతితో పాటు అడవుల పెంపుదలకే హరితహారానికి ప‌థకాల‌ను అమ‌లు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. దీంతో పాటు మన ఊరు-మన బడి కింద 7300 కోట్లు వెచ్చించి ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియంలో తరగతులు నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌రోవైపు వ‌చ్చే రెండు సంవత్సరాల్లో తాండూరు నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంక రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సాయి రెడ్డి(నరేంధర్ రెడ్డి), వైస్ ఎంపీపీ స్వరూపరాణి, సర్పంచులు నరేందర్ రెడ్డి,రాజప్ప గౌడ్, జగదీష్, స్వప్న చంద్రశేఖర్ రెడ్డి ఉప సర్పంచులు గోవిందు,కైరతలీ, వెంకటేష్ గౌడ్, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు శకుంతల, టీఆర్ఎస్‌కేవీ తాండూరు అధ్యక్షుడు గోపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భీమ్ రెడ్డి,మల్లప్ప‌, పంచాయతీ రాజ్ వేంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు ఉమాశేఖర్‌, ఎంపీడీవో సుదర్శన్ రెడ్డి అధికారులు అధికారులకు తదితరులు పాల్గొన్నారు.