కంపు కుంట..!
– ఆదర్శనగర్ వాసుల ఇక్కట్లు
– పట్టించుకోని అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో ఆదర్శం అని పేరు ఉన్న ప్రాంతం అది. అదే ప్రాంతంలో మురుగునీరుతో భారీ చెరువుగా కనిపించే కుంటను ఆదర్శ నగర్ కుంట అని పిలుస్తారు. ఇదే స్థలంలో ఆధునిక పార్కు ఏర్పాటు చేయాలన్నదే పాలకులు, అధికారుల లక్ష్యం. మరి ఇంతటి ప్రాధాన్యమున్న ప్రాంతానికి కంపు ఇంపుగా మారింది. గతంలో ఈ కుంటలో చేపలను వదిలేవారు. వారం రోజు పట్టుకొచ్చి అమ్మేవారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగానో.. ఇతర కారణాలేమో తెలియదు గాని ప్రస్తుతం కుంట కంపుకొడుతోంది. ఎంతలా అంటే స్థానికుల ముక్కుపుటలు అధిరేలా. ఇంతటి కంపును భరించలేని స్థానికులు మొదట వార్డు కౌన్సిలర్ దృష్టికి తెచ్చారు. కాలనీ వాసుల బాధలు విన్న కౌన్సిలర్ మున్సిపల్ అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసువకచ్చారు. అయినా కూడ సంబంధిత అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాలనీ వాసులు సైతం సమస్యను పరిష్కరించలేకపోతున్నారని పాలకులు, అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కంపు వాసన నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

