ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్ట్రీస్ నిషేధం
– తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వ వైద్యులు ప్రవేట్ ప్రాక్టీస్పై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలను సవరించి వైద్యారోగ్య శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్య శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కొత్తగా నియమితులయ్యే వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్ను రద్దు చేస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులలో స్పష్టం చేసింది. ఇప్పటికే విధుల్లో ఉన్న ప్రభుత్వ డాక్టర్లకు ప్రస్తుతానికి ఈ నిబంధనలు వర్తించవని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. వైద్యులు విధులుకు ఆలస్యంగా రావడం.. శ్రద్ధగా పని చేయకపోవడం, దీర్ఘకాలంపాటు సెలవులు పెడుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పేద ప్రజలకు మేలైన వైద్యం అందించడానికే ఈ రూల్ తీసుకొచ్చామని తెలంగాణ DH శ్రీనివాసరావు తెలిపారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై జూనియర్ డాక్టర్లు, వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు క్లినికల్, నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి (డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదా బదిలీ ద్వారా) కనీస అర్హతలను తాజా ఉత్తర్వుల్లో నిర్ధారించింది. అందరు స్పెషలిస్టులు, డాక్టర్లు కచ్చితంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేసింది.


