బోనమెత్తిన సాయిపూర్..!
– ఘనంగా గ్రామదేవత జాతర ఉత్సవాలు
– నైవేద్యం సమర్పించిన పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో ప్రధాన ప్రాంతమైన సాయిపూర్ ఆషాడ శోభ సంతరించుకుంది. ఆషాడ మాసం సందర్భంగా సాయిపూర్లో వెలసిన గ్రామ దేవతల జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
సాయిపూర్ పెద్దల ఆధ్వర్యంలో తాత గుడి సమీపంలోని ఈశ్వరమ్మ, సాయిపూర్లోని కట్ట మైసమ్మ దేవతల జాతర ఉత్సవాలు జరిగాయి. జాతర ఉత్సవాలను పురస్కరించుకుని సాయిపూర్లోని ఇంటింటి నుంచి మహిళలు బోనాలతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా.. తరలివచ్చారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు తన కూతురుతో కలిసి అమ్మవారికి బోనం మోసుకొచ్చారు. అదేవిధంగా సీనీయర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి కూడ బోనం ఎత్తుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.

మహిళలు బోనాలతో వచ్చి ఆలయాల చుట్టు ప్రదక్షణలు చేశారు. ఊ రేగింపులో డప్పు వాయిద్యాలు, పోతురాజు విన్యాసాలు, అమ్మవారి అలంకరణలో కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాల నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా తాండూరుకు చెందిన పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు.



