ఈత కోసం వెళ్లి యువకుడి జల సమాధి

క్రైం తాండూరు వికారాబాద్

ఈత కోసం వెళ్లి యువకుడి జల సమాధి
– బావిలో మునిగి ఊపిరాడక మృతి
– యాలాల మండలం జక్కెపల్లిలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: సరదాగా ఈత కొట్టేందుకు వెళ్ళిన స్నేహితుల్లో ఒకరు జల సమాధి అయ్యాడు. ఈత రాదని తెలిసి బావిలో దూకిన తరువాత మునిగి మృతి చెందాడు. మరుసటి రోజు అతని మృతదేహాన్ని అగ్నిమాపక శాఖ అధికారులు వెలికి తీశారు. ఈ విషాధకర సంఘటన వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం జక్కెపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం గ్రామానికి చెందిన కుమ్మరి మహేష్‌ కొంత మంది స్నేహితులతో కలిసి బెన్నూరు గ్రామ సమీపంలోని బావి వద్దకు ఈత కోసం వెళ్లారు. మహేష్‌కు ఈత రాకపోయిన బావిలో దూకాడు. కొద్ది సేపటికే మహేష్ నీట మునిగి బావి అడుగుకు వెళ్లిపోయాడు. స్నేహితులు ఎంత వెతికినా మహేష్‌ జాడ తెలియలేదు. దీంతో బుధవారం ఉదయం తాండూరు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మహేష్ మృత దేహాన్ని వెలికి తీశారు. కుమారుడు మృతి చెందడంతో మహేష్ తల్లి లక్ష్మమ్మ, తమ్ముడు బోరున విలపించారు.