రోడ్డు విస్తరణలో ఇష్టారాజ్యం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రోడ్డు విస్తరణలో ఇష్టారాజ్యం..!
– కాంట్రాక్టర్‌ను బెదిరించి పనులు
– పైపూతలతో ప్రజాధనం వృథా
– నాణ్యతలేని పనులను నిలిపివేయాలి
– జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత ప్రభుత్వ నిధులతో తాండూరులో నిర్మిస్తున్న జాతీయ రహదారి లింకు రోడ్డు విస్తరణ పనులు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ ఆరోపించారు. సోమవారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ గత మూడు దశాబ్దాల క్రితం రోడ్డు నిర్మాణానికి అంచనాలు వేయగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిధులు కేటాయించడం జరిగిందన్నారు. గత వారం పది రోజులుగా పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు చేపడుతున్న పనుల్లో కాంట్రాక్టర్ నాణ్యతకు తిలోదకాలు అందించారని, 30 ఏండ్ల క్రితం చేసిన డివైడర్లు శిథిలంగా మారినా వాటిపై పైపూత పనులు చేపడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా నాసిరకం గ్రిల్స్ ను నిర్మిస్తున్నారని అన్నారు. స్థానిక నేతలు కొందరు కాంట్రాక్టర్ను బెధిరించి ఈ పనులు చె యిస్తున్నారని, పనుల వద్ద ఫోటోలకు ఫోజులు ఇస్తూ తామే ఆ పనులు చేయిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్ పనులు పూర్తి చేసి వెళ్లిపోతే నష్టపోవాల్సిన తాండూరు ప్రజలేనని అన్నారు. నాణ్యత లేకుండా.. పైపూతతో ప్రజాధనం వృథా చేస్తున్న అక్రమాలపై నేషనల్ హైవేస్ అధికారులతో పాటు క్వాలిటీ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.