మళ్లీ చెడ్డీ గ్యాంగ్ అలజడి
– మహబూబ్ నగర్లో వరుస చోరీలు
– సీసీ పుటేజీలో రికార్డు అయిన దృశ్యాలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో కలవర పెట్టిన చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చేసింది. రాష్ట్రంలోని మహబూబ్నగర్లో శివారు ప్రాంతాలలో తీవ్ర అలజడిని రేపింది. శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతోంది. మహబూబ్నగర్ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ చెడ్డీ గ్యాంగ్ వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చెడ్డీగ్యాంగ్ రాత్రి చోరీకి యత్నిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. ఒంటిపై చెడ్డీ, ముఖానికి మాస్క్, చేతిలో ఆయుధం పట్టుకుని తిరుగుతోన్న ముఠా దృశ్యాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలకు చిక్కడంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. సీపీ ఫుటేజ్ ల ఆధారంగా చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నాలుగు రోజుల క్రితం బృందావన్ కాలనీలో 12 తులాల బంగారం అపహరించుకుపోయింది ఈ దొంగల ముఠా. తాజాగా అదే కాలనీలో చోరీకి విఫలయత్నం చేసింది. వరుస దొంగతనాలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్.. మకాం మార్చినట్లు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ముఠా కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

