ఆరోజు పుడితే ఆర్టీసీలో రవాణా ఫ్రీ..!
– 12 ఏండ్ల వరకు చిన్నారులకు అవకాశం
– 75 ఏండ్లు నిండిన వృద్ధులకు వైద్య సేవలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: 75వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ సంస్థ బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12 ఏళ్లు పూర్తి అయ్యేంత వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. అదేవిధంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులు ఈ నెల 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో ఆగస్టు 15 నుంచి 22 వరకు ఉచిత వైద్య పరీక్షలు అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే 75 ఏళ్లలోపు వారికి రూ.750లతో వైద్య పరీక్షల ప్యాకేజీ అమలు చేయడం జరుగుతుందని స్పష్టం చేసింది. వీటితో పాటు టీ-24 బస్ టికెటును ఆ రోజున రూ.75( సాధారణ రోజుల్లో రూ.120)కే అందిస్తామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే కాక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరిన్ని ఆఫర్లను ప్రకటించింది. టీటీడీ ప్యాకేజీని వినియోగించుకునే ప్రయాణికులకు ఈ నెల 16 నుంచి 21 వరకు రూ.75 తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. ఆగస్టు 15న కార్గోలో ఒక కిలో పార్సిల్ 75 కిలో మీటర్ల వరకు ఉచిత రవాణా సదుపాయం కల్పింస్తుంది. టాప్-75 ప్రయాణికులకు ఒక ట్రిప్ ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించనుంది. శంషాబాద్ విమానాశ్రయానికి ఆగస్టు 15న పుష్పక్ ఎయిర్ పోర్ట్ సర్వీసును వినియోగించుకునే వారికి 75 శాతం ఛార్జీ రాయితీని ప్రకటించింది.



