బండిపై భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు
– తాండూరులో దిష్టిబొమ్మ దహనం
– ఖబర్దార్ బండి సంజయ్ అంటూ నినాదాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్పై తాండూరు బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఎమ్మెల్సీ కవితపై ఈడీ నోటీసుల విచారణ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వాఖ్యలను ఖండించారు. శనివారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, నేతలు, కౌన్సిలర్లు తదితరులు మాట్లాడుతూ బండి సంజయ్ మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా వాఖ్యలు చేశారని అన్నారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వాఖ్యలను సహించేది లేదని అన్నారు. బండి వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సీబీ, సీఐడీ, ఈడీ దాడులకు బీఆర్ఎస్ భయపడదని అన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పడం తెలంగాణ నుంచే ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు విజయదేవి, ఆసిఫ్, వెంకన్న గౌడ్, నాయకులు నరేందర్ గౌడ్, హరిహరగౌడ్, అబ్దుల్ రజాక్, నీరటి హన్మంతు, సాగర్ గౌడ్, ఇంతియాజ్, ఈర్షాద్, మోయిజ్ తదితరులు పాల్గొన్నారు.

