కార్మికులకు న్యాయం చేయండి
– పెంచిన వేతనాలను అమలు చేయండి
– జిల్లా కలెక్టరుకు ఏఐటీయూసీ నేతల వినతి
– కలెక్టర్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల ధర్నా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు.

పీఆర్సీ వేతనాలు చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్, సీనియర్ నాయకులు ఏసురత్నం తదితరులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పీఆర్సీ వేతనాల అమలులో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం వహించడం దుర్మార్గమన్నారు. అనంతరం నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు రెండేళ్ల నుంచి 11వ పీఆర్సీ వేతనాలు అమలు కావడం లేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రాష్ట్రమంతా అమలవుతున్నా.. తాండూరులో అమలు కావడం లేదని, దీంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్మికులకు పెంచిన వేతనాలను అమలు చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గోపాల్, తాండూరు అధ్యక్షులు వీరప్ప, కార్యదర్శి భూపతి, కార్మికులు పాల్గొన్నారు.

