రేషన్, ఆధార్ కార్డుల లింకు గడువు పెంపు
– చేసుకోని వారి అర్హులకు ఊరట
– ఎలా లింక్ చేసుకోవాలో తెలుసుకోండి
దర్శిని డెస్క్ : దేశంలోని రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలకు ఉపశమనం కల్పించేలా కేంద్రం శుభవార్త అందించింది. రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 31తో ఈ గడువు ముగుస్తుండగా దానిని మరో మూడు నెలల వరకు పొడిగించింది. ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేసుకోవడం ద్వారా రేషన్ మోసాలకు చెక్ చెప్పవచ్చు. ఒకే వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ కార్డుల ద్వారా రేషన్ పొందకుండా ఉండేందుకు ఆధార్ లింక్ ఉపయోగపడుతుంది. డూప్లికేట్ రేషన్ కార్డులను గుర్తించేందుకు ఆధార్ లింక్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా నిజంగా అర్హత కలిగిన వారికి మాత్రమే స్కీమ్ ప్రయోజనాలు అందుతాయి. అందుకోసం కేంద్రం రేషన్ కార్డు, ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది. రేషన్ కార్డుతో ఆధార్ లింక్ గడువు సాధారణంగా మార్చి 31తో ముగుస్తోంది. అయితే ఈ డెడ్లైన్ను కేంద్ర సర్కార్ జూన్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ తాజాగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికీ రేషన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే అనుసంధానం చేసుకోవడం మేలు. లేదంటే గడువు తర్వాత రేషన్ కార్డు చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఆఫ్లైన్, లేదా ఆన్లైన్ విధానంలో ఏ విధంగా ఆధార్ లింక్ చేసుకోవాలో తెలుసుకుందాం.
ఎలా లింక్ చేయాలి?
రేషన్ కార్డుతో ఆధార్ లింక్ చేయాలనుకుంటున్న వారు ముందుగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్కు వెళ్లాలి. అందులో ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. దానిపై క్లిక్ చేసి రేషన్ కార్డు నంబర్, ఆధార్ కార్డు నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్ నొక్కాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీనీ ఎంటర్ చేయాలి. ప్రాసెస్ పూర్తయిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. మరోవైపు.. రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటివి రేషన్ ఆఫీసుకు లేదా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదా రేషన్ షాపులో అందిస్తే సరిపోతుంది. వారు ఆధార్, రేషన్ కార్డు లింక్ చేస్తారు.

