చోరీ మోబైల్ను పట్టించే సీఈఐఆర్
– వచ్చే నెల నుంచి అందుబాటులోకి
– అమలుకు పోలీసు, టెలికాం శాఖ కసరత్తు
– అసలు ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంటే…?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: మీ ఫోన్ చోరీ అయ్యిందా..? లేదా మీరు మోబైల్ ఫోన్ పోగొట్టుకున్నారా.. అయితే బాధపడకండని పోలీసు శాఖ, టెలీకాం శాఖ అధికారులు అంటున్నారు. పోయిన, చోరీ అయిన్ సెల్ ఫోన్ల ఆచూకీ కనిపెట్టడం ఇక సులభతరం కాబోతుందని పేర్కొంటున్నారు. పోయిన ఫోన్ను కనిపెట్టేందుకు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ (సీఈఐఆర్) విధానం రాష్ట్రంలో అందుబాటులోకి తెస్తున్నట్లు తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. సెల్ఫోన్లు పోగొట్టుకోవడం, చోరీ కావడం వంటి కేసులు బాగా పెరుగుతున్నాయని.. ఇలాంటి బాధితులకు న్యాయం చేసేందుకే కొత్తగా ప్రవేశపెడుతున్న సీఈఐఆర్ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని 750 పోలీస్స్టేషన్లలోని పోలీసుశాఖ కమీషనర్లు, ఎస్పీలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఎలా పనిచేస్తుందంటే..?
సెల్ఫోన్ పోయిందని ఎవరైనా స్టేషన్కు వస్తే రిసెప్షనిస్ట్ సీఈఐఆర్ యాప్లో నమోదు చేయాలని సూచించారు. వెంటనే ఆ సెల్ఫోన్ పనిచేయడం నిలిచిపోతుందని, ఎవరైనా అందులో సిమ్కార్డు వేయాలని ప్రయత్నిస్తే ఆ విషయం కూడా తెలుస్తుందని, ఫోన్ దొరికిన తర్వాత పొగొట్టుకున్న వ్యక్తి దాన్ని తీసుకొని యథావిధిగా వాడుకోవచ్చని వివరించారు. ఈ వ్యవస్థను రాష్ట్రంలో ప్రపంచ టెలికాం దినోత్సవం సందర్భంగా మే 17 నుంచి దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. సీఐడీ అదనపు డీజీ మహేష్భగవత్ మాట్లాడుతూఅధికారులకు ఈ విధానంపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

