తొందరొద్దు..!
– విత్తుకోవడానికి సమయం కాదు
– రైతులకు వాతావరణ శాఖ సూచన
– నైరుతి రాక ఆలస్యంపై సలహా
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఎండాకాలం ముగిసినా చినుకరాక ఆలస్యమౌతోంది. వ్యవసాయ సాగుకు రైతులు తొందపడుతున్నారు. దీనికి సమయం కాదని, రైతులు ఇంకాస్త వేచి ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు ఇంకా తెలంగాణను తాకలేదు. నైరుతి రుతపవనాల రాక ఈ ఏడాది ఆలస్యమవుతోంది. రెండ్రోజుల క్రితం రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. నెమ్మదిగా కదులుతున్న రుతుపవనాలు ఏపీలోనే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల వరకే విస్తరించాయి. వచ్చే వారం రోజుల తర్వాత తెలంగాణను కూడా తాకనున్నాయని అధికారులు ఆంచనా వేస్తున్నారు. ఈ నెల 18వ లోపు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని పేర్కొంటున్నారు. అనంతంరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి మరింత సమయం పడుతుందని చెప్పారు.
రుతు పవనాల రాక ఆలస్యం కావటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తొందరపడి విత్తనాలు విత్తుకోవద్దని సూచిస్తున్నారు. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన తర్వాతే విత్తనాలు వేయటం మంచిదని చెబుతున్నారు. ఈనెల 18న రుతు పవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉన్నందున సరిపడ వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని సూచిస్తున్నారు. రుతుపవనాల ఆలస్యంతో మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తుండడంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. అలాగే ఇవాళ, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.
ఇది కూడా చదవండి…


