మళ్లీ.. ‘రాజీ‘కీయం..!
– తెరపైకి మున్సిపల్ పదవి ఒప్పందం
– పట్టుబట్టిన పట్లోళ్ల దీపా నర్సింలు..?
– చైర్ పర్సన్తో రాజీనామాకు మొర
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు మున్సిపల్లో మళ్లీ ‘రాజీ’కీయాలు మొదలయ్యాయి. బల్దీయా చైర్ పర్సన్ కుర్చీ కోసం రెండున్నరేళ్ల ఒప్పందాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఈ వ్యవహారం జిల్లాలోని తాండూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి మహేందర్ రెడ్డి వర్గంలో ఉన్న స్వప్న పరిమళ్ మున్సిపల్ చైర్ పర్సన్గా కొనసాగుతుండగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గంలో ఉన్న పట్లోళ్ల దీపా నర్సింలు వైస్ చైర్ పర్సన్గా కొనసాగుతున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇద్దరి మద్య చైర్ పర్సన్ పదవి విషయంలో రెండున్నరేళ్ల పదవి ఒప్పందం జరిగిన ప్రచారం అందరికి తెలిసిందే. గతంలో మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డిల మద్య వర్గపోరు ఉండడంతో ఒప్పందాలు అమలు కాలేదు. జనవరి 27నాటికే ఆమె మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసి నాలుగో ఏటా కొనసాగుతోంది.
మహేందర్రెడ్డి వర్గంలో స్వప్న, రోహిత్రెడ్డి వర్గంలో దీప కొనసాగుతూ వచ్చారు. అప్పట్లో స్వప్న రాజీనామా కోసం అధిష్ఠానం నుంచి ఒత్తిడి చేయించినా మహేందర్రెడ్డి రాజీనామా చేయించకుండా స్వప్నకు మద్దతు ఇచ్చారు. స్వప్న రాజీనామాకు మంత్రులు సబితారెడ్డి, తలసాని శ్రీనివా్సయాదవ్, ఎంపీ రంజిత్రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి స్వప్నపై వైస్చైర్పర్సన్ దీప అవిశ్వాసం పెడుతూ మెజార్టీ కౌన్సిలర్లతో కలెక్టర్కు అవిశ్వాస పత్రం ఇవ్వగా స్వప్న హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. పదవి విషయంలో తగ్గలేది అన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడితో విషయాన్ని వదిలేశారు. తాజాగా మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఒక్కటి కావడంతో మున్సిపల్లో మళ్లీ ఒప్పంద రాజకీయాలు మొదలయ్యాయి. చైర్పర్సన్గా అవకాశం ఇవ్వాలని దీపా పట్టుబట్టారు. ఈ మేరకు మంత్రులు సబితారెడ్డి, మహేందర్రెడ్డి,, హరీ్షరావుకు తేల్చి చెప్పారు. దీంతో చైర్పర్సన్ స్వప్న రాజీనామా వ్యవహారాన్ని ఎంపీ రంజిత్రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. మళ్లీ తెరపైకీ వచ్చిన ఒప్పంద రాజకీయాలు తాండూరులో చర్చనీయాంశంగాను ఆసక్తికరంగాను మారాయి. ఈ సారైనా ఒప్పందాలు అమలు అవుతాయా లేదా అనేది వేచి చూడాలి.
ఇది కూడా చదవండి…

