ఆధార్‌ సెంటర్లలో అవస్థల తిష్ట..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆధార్‌ సెంటర్లలో అవస్థల తిష్ట..!
– కనీస వసతుల లేమితో ఇక్కట్లు
– పట్టించుకోవడం లేదని ఆవేధన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినియోగదారులకు ఆధార్ కేంద్రాలు పెంచినా రెట్టించిన కష్టాలు వెంటాడుతున్నాయి. కేంద్రాల వద్ద తిష్టవేసిన ఇక్కట్లతో ఆప్డేట్ కోసం వచ్చిన పెద్దలు, వృద్ధులు, చిన్నారులు, మహిళలు ముప్పు తిప్పలు పడుతున్నారు. రేషన్ కార్డుతో పాటు వివిధ అవసరాలకు ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ అనుసంధానం తప్పనిసరైంది. ముఖ్యంగా రేషన్ కార్డు ఈకేవైసీ కోసం ఆధార్ అనుసంధానం ఈ నెల 31వరకే గడువు ఉండడంతో లబ్దిదారులు ఆధార్ కేంద్రాలకు పరుగెడుతున్నారు. తాండూరులోని పోస్టాఫీసులో తలెత్తిన ఇబ్బందులను గుర్తించి ఇటీవలే పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాయలంలో మూడు కొత్త కేంద్రాలు ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉన్న ఇక్కడ కూడా ఇబ్బందులు తప్పడం లేదు.

ప్రతి రోజూ 150 టోకన్లు మాత్రమే ఇస్తుండడంతో వినియోగదారులు తెల్లవారు జాము నుంచే కార్యాలయానికి పోటెత్తుతున్నారు. బారులు తీరడంతో కార్యాలయం కిక్కిరిసిపోతోంది. కార్యాలయంలో కనీస వసతులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుల కోసం కుర్చీలు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆధార్ కేంద్రాల సేవలను విస్తరించాలని మున్సిపల్ తో పాటు మండలాలకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!