చేతగాని కాంగ్రెస్..!
– రుణమాఫీపై సవాల్ చేస్తే స్పందించని ఎమ్మెల్యే
– తాండూరుకు ఏం తెచ్చిండని కొండాకు ఓటేయ్యాలే
– ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేని చేతగాని కాంగ్రెస్ పార్టీ అని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం తాండూరు పట్టణంలోని 1నుంచి 6వ వార్డు, 24, 25వ వార్డులో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరుపున రోడ్ షోలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రైతు రుణమాఫీ అమలు చేయలేదన్నారు. ఆగస్టు 15న రూ. 2లక్షల రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తారా అని తాండూరు ఎమ్మెల్యేకు సవాల్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
దీనిపై ఎమ్మెల్యే స్పందించకపోవడం చూస్తుంటే ముఖ్యమంత్రిపైనే ఎమ్మెల్యేకు నమ్మకం లేదన్నట్లుగా కనిపిస్తుందన్నారు. అందుకే ఎమ్మెల్యే స్పందించడం లేదన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా తీసుకవచ్చిన నిధులను రద్దు చేసి అభివృద్ధిని అడ్డుకున్నారని అన్నారు. అదేవిధంగా బీజేపీ చెప్పితేనే రామున్ని మొక్కడం లేదని, రాముడు అందరి దేవుడన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాండూరుకు ఏం చేశాడని ఓటెయ్యాలో ప్రశ్నించుకోవాలన్నారు. బీజేపీని కూడా నమ్మొద్దన్నారు. ఆరు గ్యారెంటీలతో ప్రభుత్వం ప్రజలకు మోసం చేసి అన్యాయం చేసిన కాంగ్రెస్కు 13న జరిగే ఎన్నికల్లో మోసంపై ప్రతిఒక్కరు ప్రతికారం తీర్చుకోవాలన్నారు.
ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి అందరిని ఆదుకునే కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకుందామన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ చారి, మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్, కౌన్సిలర్లు మంకాల రాఘవేంధర్, సంగీత ఠాకూర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు యూసుఫ్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

