అయ్యో.. పాపం కూలీ..!
– కూలీ పనికి వెళ్లిన లారీలోనే మృతి
– భార్య ఫిర్యాదుతో పోలీసుల కేసు
– వివరాలు వెల్లడించిన సీఐ సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కూలీ పనికోసం లారీలో వెళ్లిన దినసరి కూలీ అదే లారీలో అకాల మరణం చెందాడు. అయ్యో పాపం కూలీ అనే ఈ విషాధ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు నియోజకవర్గం యాలాల మండలం జక్కెపల్లికి చెందిన జంపని నర్సింలు అలియాస్ రాజు(43) దినసరి కూలీగా పనిచేసేవాడు. రోజూ మాదిరిగినే ఆదివారం నర్సింలు మెదక్ జిల్లా నర్సాపూర్కు వెళ్లే లారీ లోడ్ను ఖాళీ చేసే కూలీ పనికి వెళ్లాడు.
లారీలో ఉన్న నర్సింలు మార్గ మద్యలో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన లారిలో వ్యక్తులు చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాజు మృతి చెందినట్లు నిర్దారించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుని భార్య జిల్లా ఆసుపత్రికి చేరుకుని బోరున విలపించింది. తన భర్త అనారోగ్యం కారణంగా మృతి చెంది ఉంటాడని తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. కూలీ పని కోసం లారీ ఎక్కిన నర్సింలు అదే లారీలో మృతిచెందడం విచారానికి గురిచేసింది.
ఇదికూడా చదవండి…

