ఇందిరమ్మలో అర్హులకు అన్యాయం..!
– కాంగ్రెస్ నేతలకే ఇందిరమ్మ ఇండ్లు
– దుర్మార్గంగా లబ్దిదారుల ఎంపిక
– బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖాపురం ఆంజనేయులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులకు అన్యాయం చేస్తోందని బీజేపీ వికారాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖాపురం ఆంజనేయులు విమర్శించారు. బుధవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో కాంగ్రెస్ నేతలు, ఇందిరమ్మ కమిటి సభ్యులు ఏకపక్షంగా వ్యవహిస్తున్నారని అన్నారు.

గ్రామాలలో సభలు నిర్వహించకుండా.. ఇష్టానుసారంగా పేర్లను సిఫార్సు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల అనుచరులకు, ఇదివరకే ఇండ్లు ఉన్న లబ్దిదారులను పథకానికి అర్హులుగా ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. అర్హులకు అన్యాయం చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులను గుర్తించకుండా.. అన్యాయానికి పాల్పడితే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని అన్నారు. గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్దిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పథకంలో కూడా సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన వారికి సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇందులో ఏదైనా అవక తవకలకు పాల్పడితే బీజేపీ నుంచి ఆందోళనలు చేపట్టక తప్పదని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

