బాలల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు
– ఎమ్మార్వో చిన్నప్పల నాయుడు, సీఐ రాజేందర్ రెడ్డి
– తాండూరులో కొనసాగుతున్న చైల్డ్లైన్ దోస్తీ వారోత్సవాలు
తాండూరు రూరల్, దర్శని ప్రతినిధి: బాలల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిలు అన్నారు. చైల్డ్ లైన్ దోస్తీ వారోత్సవాలలో భాగంగా సోమవారం తాండూరు మండల పరిషత్ కాంప్లెక్స్ ఏరియాలో సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, సీఐ రాజేందర్ రెడ్డిలు హాజరై బాలల హక్కులకు మద్దతుగా నిలుస్తామని సంతకాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాలలకు కీడు తలపెట్టిన, హక్కులకు భంగం కలిగించినా సహించేది లేదన్నారు. బాలల హక్కులకు మద్దతుగా నిలుస్తామన్నారు. బాల్య వివాహాలు, బాలకార్మికుల నిర్మూలన కొరకు బాధ్యతగా వ్యవహరిస్తామన్నారు. పిల్లలను బాలకార్మికులుగా పనులకు ఉపయోగించుకుంటున్నా, బాల్యవివాహాలు జరిపినా, పిల్లలను వేధింపులకు గురి చేస్తన్నా.. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు
తీసుకుంటామని తెలిపారు. ఎవరైన ఆపదలో ఉంటే 100తో పాటు చైల్డ్ లైన్ 1098కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ, ఏపీఓ రతన్ సింగ్, ఏపిఎం ఆనందం, ఐసీడీఎస్ సూపర్ వైజర్ యాదమ్మ, విఆర్వోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ వై వెంకటేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

