రైతు చట్టాలు వెనక్కి తీసుకోవడం కేసీఆర్ విజయం.!
– తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి: కేంద్రం నూతన వ్యవసాయ చట్టలను వెనక్కి తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన విజయమేనని తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అభివర్ణించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతుల ధాన్యం కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన దర్నాతో కేంద్రం చట్టాల రద్దులో వెనక్కితగ్గిందన్నారు. ఈ దర్నాలో రైతుల కోసం ఉద్యమిస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ప్రధాని నరేంద్ర మోడి వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రకటనతో బీజేపీ జాతీయ స్థాయిలో పట్టు కోల్పోతుందనే భయంతోనే చట్టాలను రద్దు చేశారని అన్నారు. అదేవిధంగా ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా, రైతుబంధు, రుణమాఫీ తదితర పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టిన రైతులు సర్కారు వెన్నంటే ఉంటారని అన్నారు. రెండు మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ కేంద్రం నుంచి స్పష్టమైన హామి వచ్చే విధంగా కృషి చేస్తాని విశ్వాసం వ్యక్తం చేశారు.

