చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
– సబ్ డివిజన్లో 3నెలల్లో 12 కేసులు
– 7 కేసుల్లో నిందితులపై చర్యలు
– రూ. 5లక్షల్లో రూ.1.83లక్షల సొత్తు రికవరీ
– తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ డివిజన్ పరిధిలో దొంగతనాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు స్థానిక డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు.

మంగళవారం సబ్ డివిజన్ పోలీసు అధికారులో సమీక్ష నిర్వహించారు. ఈ యేడాది జనవరి నుంచి మార్చి వరకు నమోదైన కేసుల గురించి సమీక్షించారు. మూడు నెలల్లో మొత్తం 12 దొంగతనాల కేసులు నమోదు కాగా, అందులో పగటిపూట దొంగతనం 2, రాత్రి వేళల్లో జరిగిన దొంగతనం 03, పశువుల దొంగతనాలు 02,దృష్టి మళ్లించి దొంగతనాలు 01, సాదారణ దొంగతనాలు 04 జరిగినట్లు అధికారులు నివేధిక అందించారు. ఇందులో రూ. 5లక్షల విలువైన సొత్తు చోరీకి గురి కాగా ఇప్పటివరకు 7 కేసులలో నేరస్తులను గుర్తించి, వారి నుంచి రూ. 1,83,000ల సొత్తును రికవరి చేసినట్లు నివేధికలో వెల్లడించారు.

మిగతా కేసులలో కూడా నిందితులను త్వరలోనే పట్టుకొని, చోరీకి గురైన మిగతా సొత్తును స్వాధీనం చేసుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు డీఎస్పీకి తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ దొంగతనాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. బ్ల్యూ కొల్ట్స్, పెట్రో కార్స్, ఐడి పార్టీలతో పాటు బీట్ డ్యూటీల ద్వారా పోలీస్ అధికారులు నిరంతరం పగలు, రాత్రి పోలీసు పెట్రోలింగ్ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయాలలో దొంగతనాల నివారణకు, శాంతి భద్రతల పరిరక్షణకు సబ్ డివిజన్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక నైట్ చెకింగ్ అధికారిని, సబ్ డివిజన్ చెకింగ్ అధికారులను కూడా నియమించి ఎప్పటికప్పుడు గస్తీ అధికారులను పర్యవేక్షించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రజలు కూడా చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


