మహిళకు తుంటి మార్పిడి ఆపరేషన్
– తాండూరు బాలాజీ ఆసుపత్రిలో విజయవంతం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తుంటి నొప్పితో బాధపడతున్న మహిళకు తుంటి మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు.

తాండూరులోని బాలాజీ నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే… యాలాల మండలం అచ్చుతాపూర్ గ్రామానికి చెందిన సులోచన(59) రెండేళ్ల క్రితం కిందపడిపోవడంతో తుంటి ఎముక విరిగి పోయింది. నాటు వైద్యం చేయించుకోవడంతో నొప్పి తగ్గక ఇబ్బంది పడుతోంది.

శనివారం తాండూరులోని బాలాజీ నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రికి చెందిన డా.బీ. విహాసిద్, డా.శరత్ చంద్ర పర్యవేక్షణలో ఆమెకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో సులోచనకు ఎడమ తుంటి వద్ద నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ వల్ల ఆమె కాలు 2సెంటీ మీటర్లు పొట్టిగా మారినట్లు గుర్తించారు. చికిత్సలో భాగంగా వైద్యుల ఆధ్వర్యంలో శనివారం తుంటి ఆపరేషన్ నిర్వహించారు.

సిమెంట్ లేని టోటల్ హిప్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో ఆసుపత్రిలో సులోచన క్షేమంగా కోలుకుంటున్నారు. ఈ ఆపరేషన్లో డా. మోహన్ అనస్థీషియా అందించగా, డా. విజయ్ జమాదార్ అసిస్టెంట్గా సేవలు అందించారు. మరోవైపు సులోచనకు తదుపరి చికిత్సను కూడా అందించబోతున్నట్లు డా. బీ.విహాసిత్ తెలిపారు.


