అమెరికాలో వైనరీ సందర్శన..!
– పర్యాటక అభివృద్ధిపై అధ్యయనం
– మంత్రి, విప్ లతో కలిసి పరిశీలించిన మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డితో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిలు వర్జీనియా రాష్ట్రంలోని ప్రముఖ స్టోన్ టవర్ వైనరీని సందర్శించారు.

ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ వైనరీలో అమలవుతున్న ఆధునిక నిర్వహణ విధానాలు, ద్రాక్ష సాగు నుంచి వైన్ తయారీ వరకు అనుసరించే సాంకేతిక ప్రక్రియలు, సందర్శకులకు అందిస్తున్న ప్రత్యేక సౌకర్యాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా పర్యాటక రంగాన్ని ఆర్థికాభివృద్ధికి అనుసంధానం చేసే విధానం, స్థానిక ఉపాధి కల్పన, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే వ్యూహాలపై వైనరీ నిర్వాహకులతో చర్చించారు.

తెలంగాణలో కూడా పర్యాటక రంగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రపంచంలోని విజయవంతమైన నమూనాలను అధ్యయనం చేయడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. విదేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా పరిశీలించి అమలు చేసే అవకాశాలపై కూడా వారు దృష్టి సారించినట్లు సమాచారం.



