గణనాథుల ఆగమనంపై ఆంక్షలు వద్దు..!
– వినాయకుల ఊరేగింపులో ఇబ్బందులు ఉండవు
– తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : గణేష్ ఉత్సవాల సందర్భంగా వినాయక విగ్రహాల ఆగమనం, స్వాగత ఊరేగింపులపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కోరారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాండూర్లో గణనాథుల ఆగమన వేడుకలు, స్వాగత ఊరేగింపులు సాంప్రదాయబద్ధంగా కొనసాగుతాయని తెలిపారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో గణనాథుడిని స్వాగత ఉత్సవాలు నిర్వహిస్తారని అన్నారు.

ఇప్పటివరకు ఈ కార్యక్రమాల కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిన సందర్భాలు లేవన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భక్తులు గణనాథులకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు కూడా పోలీస్ శాఖకు సహకరిస్తారని అన్నారు.

కావున గణేష్ ఆగమనంపై ఆంక్షలు విధించరాదని ప్రజల తరఫున పోలీస్ శాఖకు ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. నిర్వహకులు కూడా శాంతిభద్రతలను కాపాడుతూ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సమన్వయంతో వ్యవహరించాలని కోరారు.


