కంపు కదలదేమి..? మురుగుతో నరకం..!
– వర్షానికి పొంగిపొర్లిన మురుగు కాలువలు
– పూడిక తీసినా.. తొలగని మురుగు నీరు
– పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది
– కౌన్సిలర్పై స్థానికుల అసహనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని 10వ వార్డులో మురుగు కాలువల నిర్వహణ అధ్వానంగా మారింది.

శనివారం అర్థరాత్రి కురిసిన వర్షానికి మురుగు కాలువలు పొంగిపొర్లడంతో మురుగు నీరు రోడ్లపైకి చేరింది. దీంతో స్థానికులు, అటుగా రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఒక రోజు ముందే కాలువల్లో పూడిక తీయగా, ఆ వ్యర్థాలను అక్కడే వదిలేయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూడిక, చెత్తాచెదారం తొలగించకపోవడంతో మురుగు నీరు సాఫీగా ప్రవహించకుండా రోడ్డు పక్కనే నిలిచిపోయింది. దుర్గంధం వెదజల్లడంతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కాలువల్లోని మురుగును, పూడికను పూర్తిగా తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని, వార్డు కౌన్సిలర్ సైతం సమస్యపై దృష్టి సారించడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మురుగు నీటిని తొలగించి, కాలువలను శుభ్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


