కాలుష్యాన్ని నియంత్రించాలని కాలినడక
– జాతీయ జెండాతో పాదయాత్ర చేపట్టిన సామన్యుడు
– విషయం తెలిసి అడ్డుకున్న తాండూరు పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో విపరీతంగా పెరిగి పోతున్న కాలుష్యాన్ని నియంత్రించాలని ఓ సామాన్యుడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కాలినడక ప్రారంభించాడు. భుజాన జాతీయ జెండా మోస్తూ పాదయాత్రను చేపట్టిన వ్యక్తిని తాండూరు పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ గ్రామానికి చెందిన బోయిని అంబ్రేష్ శుక్రవారం ఉదయం తాండూరు నుంచి పాదయాత్ర చేపట్టారు. తాండూరులో కాలుష్యం, రోడ్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జాతీయ జెండాను మోస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సమస్యలను వివరించడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే విషయం తెలుసుకున్న తాండూరు పట్టణ పోలీసులు హైదరాబాద్ రోడ్డు.. రాజీవ్ కాలనీ మార్గంలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు అంబ్రేష్ గతంలో రోడ్లు బాగుచేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొర్లుదండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశాడు. సొంత పార్టీకి వ్యతిరేకంగా నిరసన చేయడంపట్ల ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి తొలగించిన తాండూరు సమస్యలపై పోరాడుతానని అప్పట్లో పేర్కొన్నారు. తాజాగా జాతీయ జెండాతో పాదయాత్ర చేపట్టి చర్చనీయాంశంగా మారారు.

