అమ్మో ఆర్టీసీ దొంగ..!
– రూ. 40 వేల విలువైన వస్తువుల చోరీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ డీపోలో పనిచేస్తున్న ఓ కార్మికుడు పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసి వామ్మో అనిపించేలా చేశాడు. సంస్థకు చెందిన దాదాపు రూ. 40 వేల విలువైన వస్తువులను చోరీ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డీపోలో చోటు చేసుకున్న ఈ ఘటనపై ఆ శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు ఆర్టీసీ డీపోలో నగేష్ అనే వ్యక్తి కార్మికుడుగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి డీపోలోని ఆర్టీసీ బస్సులకు సంబంధించి బ్రేక్ డ్రమ్స్, 6 స్ర్పింగ్స్ లను అపహరించుకు పోయేందుకు యత్నించాడు. డీపో బయట పడేసి పారిపోతుండగా ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, సెక్యూరిటీ గార్డ్స్ గమనించగా చోరీకి పాల్పడింది నరేష్గా గుర్తించారు. విషయాన్ని డీపో మేనేజర్ పవిత్రకు తెలియజేశారు. ఆమె ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారి దశరథరావు తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చోరీకి పాల్పడిన నగేష్పై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా నగేష్ చోరీకి పాల్పడిన వస్తువులు దాదాపు రూ. 40వేల విలువ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. పనిచేస్తున్న సంస్థలోనే ఆర్టీసీ కార్మికుడు చోరీకి పాల్పడడం డీపోలో చర్చనీయాంశంగా మారింది.

