కుస్తీమే సవాల్..!
– జీవన్గీలో అలరించిన పహిల్వాన్ పట్లు
– విజేతగా నిలిచిన కర్ణాటక వాసి
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి: కండబలంతో వేగంగా దూసుకొస్తున్న మరో బలాఢ్యుడిని వేగంగా పరుగెత్తి అడ్డుకొని, ఎత్తుకు పైఎత్తు చిట్కాలతో వెల్లకిలా చేయడం కుస్తీ పోటీలు భళారే అనిపించాయి. అనుక్షణం కుస్తీమే సవాల్ అంటూ వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం జీవన్గీలో కుస్తీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. ప్రతి యేడాది జీవన్గీలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడ కుస్తీ పోటీలు నిర్వహించిన పోటీలు ఉత్సహాంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. రూ. 100 నుంచి ప్రారంభమైన పోటీలు రూ. 2వేల వరకు కొనసాగాయి. ఈ పోటీల్లో తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన యువకులు కుస్తీ పట్లు పట్టారు. హోరా హోరీగా సాగిన పోటీల్లో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు పడిన పట్లు ఆసక్తికరంగా కొనసాగాయి. నువ్వా.. నేనా.. అంటూ పోటీలలో గెలుపుకు ఎవరి పంథా వారు కొనసాగించారు. చివరకు కర్ణాటక రాష్ట్రం కల్బుర్గి జిల్లాకు చెందిన సిద్దూ అనే వ్యక్తి పోటీలో గెలిచి వెండి కడియాన్ని సొంతం చేసుకున్నారు.

తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ విజేతకు కడియాన్ని బహుకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి, ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి, తహసీల్దార్ వెంకటస్వామి, డిప్యూటి తహసీల్దార్ వీరేశంబాబు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
….ఇంకా ఉంది..
కలశంకు భలే డిమాండ్
మరోవైపు జీవన్గీ గ్రామంలోని మహాదేవ లింగేశ్వర స్వామి కలశంపై భలే డిమాండ్ లభించింది. మూడు రోజులుగా జరిగిన జాతర ఉత్సవాలలో భాగంగా కలశంను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. గురువారం ఈ కలశానికి వేలం వేయడంలో డిమాండ్ లభించింది. జీవన్గీ గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి ఈ కలశాన్ని రూ. 50వేలకు దక్కించుకున్నారు.


