కంది పొట్టుకు నిప్పు
– పెద్దేముల్ మండలం కందనెల్లిలో ఘటన
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: పొలంలో ఉంచిన కంది పొట్టుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ సంఘటన శుక్రవారం పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డి తన పొలంలో కంది పంట పూర్తి కావడంతో పొట్టును పొలంలో ఉంచారు. అయితే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పొలానికి రక్షణగా ఉన్న షోలార్ ఫెన్షింగ్ను ద్వంసం చేసి పొలంలోకి చొరబడ్డారు. అనంతరం పొలంలో ఉన్న కంది పొట్టుకు నిప్పంటించి పరారయ్యారు. గమనించిన గ్రామస్తులు వచ్చి చూసే సరికి పొట్టు పూర్తిగా బూడిదగా మారింది. దాదాపు 10 ఎకరాలకు సంబంధించిన పొట్టు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో కాలిపోయిందని బాధిత రైతు వాపోయారు. ఈ మేరకు రూ. వేలల్లో నష్టం జరిగిందని తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

