మార్కెట్లో మెరుగైన వసతులు
– రూ.10లక్షలో రైతులకు విశ్రాంతి భవనం
– రూ.1.25 కోట్లతో షెడ్ల నిర్మాణం
– త్వరలోనే కొత్త మార్కెట్ కు భూమి పూజ
– మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటిలో మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ విఠల్ నాయక్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. మార్కెట్లో రైతుల కోసం రూ. 10 లక్షలతో విశ్రాంతి భవనం, మరుగుదొడ్లు, తాగునీటి వసతి వంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. రూ. 1 కోటి 25 లక్షలతో షెడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నామన్నారు. త్వరలోనే 30 ఎకరాలలో కొత్త మార్కెట్ కమిటీ నిర్మాణానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో భూమి పూజ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా కార్మిక దినోత్సవం మే డేను పురస్కరించుకుని మార్కెట్ కమిటిలోని 249 మంది కార్మికులకు ఏకరూప దుస్తులను చైర్మన్ విఠల్ నాయక్ చేతుల మీదుగా కమిటి డైరెక్టర్లతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కార్యదర్శి రాజేశ్వరి, వ్యవసాయ శాఖ అధికారి రుద్రమూర్తి, డైరెక్టర్లు పద్మమ్మ, ఆశన్న, సప్తగిరిగౌడ్, కట్కం వీరేందర్, దినేష్ సింగ్ ఠాకూర్, మల్లప్ప, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


