రైతులకు అండగా కేసీఆర్ సర్కారు
– నష్టమొచ్చినా ధాన్యం కొనుగోలుకు ముందుకు
– రైతులను ముంచిన మోడీ ప్రభుత్వం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: ధాన్యం కొనుగోళ్లలో జూటా బీజేపీ దగా చేస్తే సీఎం కేసీఆర్ సర్కారు రైతులకు అండగా నిలిచిందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతులను మంచే ఆలోచనే చేస్తుందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకవచ్చి రైతు వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో మోసం చేస్తోందన్నారు. బాయిల్డ్ రైస్ కొనమని ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. తెలంగాణలో బాయిల్డ్ రైసే పండుతుందనే తెలిసి కొనమని చెప్పడమేంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనమని చేతులెత్తేస్తే సీఎం కేసీఆర్ సర్కారు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిందన్నారు. నష్టమొస్తుందని తెలిసినా రైతులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. అదేవిధంగా రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతు పక్షపాతిగా నిలిచిందన్నారు.
వీధి దీపాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వీధీ దీపాల వ్యవస్థను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు. సీడీపీ నిధులు రూ. లక్ష 70 వేల తో ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ ఎంపీపీ అనురాధ రమేష్, జెడ్పీటీసీ ధారాసింగ్, వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, కోట్పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ ఉప్పరి మహేందర్, పెద్దేముల్ మండల పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్, సర్పంచ్ శ్రావణ్, ఎంపీడీఓ లక్ష్మప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


