రైల్వే రిజర్వేషన్ సేవలకు అంతరాయం
– 28, 29,30 తేదీల్లో రాత్రి వేళల్లో పనిచేయని సేవలు
దర్శిని ప్రతినిధి: రైల్వే రిజర్వేషన్ సేవలలో అంతరాయం విధిస్తున్నట్లు దక్షిణ మద్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు. నిర్వహణ పనుల దృష్ట్యా ఆగస్టు 28, 29,30 తేదీల్లో రాత్రి వేళల్లో ప్రయాణికుల ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించారు. ఆగస్టు 28న రాత్రి 23.45 గంటల నుంచి 29వ తేదీ 2 గంటల వరకు, 29వ తేదీ రాత్రి 23.45 గంటల నుంచి 30వ తేదీ 2 గంటల వరకు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ పని చేయదని పేర్కొన్నారు. దీంతో టికెట్ల రిజర్వేషన్, ఎంక్వయిరీ, రిఫండ్ సేవలు నిలిచిపోతాయన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు.


