జులై 18న రాష్ట్రపతి ఎన్నిక
– షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం
– అదే నెల 21న ఫలితాలు
దర్శిని డెస్క్ : వచ్చే నెల 18న జరిగే నూతన రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. ఈ మేరకు సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ను జూన్ 15న విడుదల చేస్తామని తెలిపారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29 అని చెప్పారు. 30 నామినేషన్లను పరిశీలన, జులై 2వ తేది వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందన్నారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహించి, అదే నెల 21న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల జులై 24తో ముగియనుంది. 2017, జులై 25న రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి వ్యక్తి రామ్నాథ్ కోవిందే.


