ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగింపు
– ఈనెల 8వ తేది వరకు చెల్లింపుకు అవకాశం
– పరీక్ష టైం టేబుల్ కూడ విడుదల
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించారు. జూన్ 28న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అడ్మిషన్ ఫీజు చెల్లింపు గడువును జూన్ 30 నుండి జూలై 6 వరకు విధించారు. బుధవారం ఈ గడువును ఈ నెల 8వ తేదీ వరకు పెంచుతూ ఆయా కాలేజీల్లో ఫీజు చెల్లించేందుకు అవకాశన్ని కల్పిస్తున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 : 30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలుంటాయి. జూలై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామ్ జూలై 22న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూలై 23న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది.

పరీక్ష టైంటేబుల్
ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు జూలై మూడో వారంలో హాల్టికెట్లు జారీ చేయనున్నారు. జులై 26 నుంచి జూలై 30 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ జనరల్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయనున్నారు.

