లారీని ఢీకొట్టిన కారు
– ముగ్గురు దుర్మరణం
– వికారాబాద్ జిల్లాలో ఘటన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : అతివేగంగా వెళుతున్న ఓ కారు ముందున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పూడూరు పరిధిలో చోటు చేసుకుంది. జిల్లాలోని పూడూరులో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను జహిరాబీ (68), జావెద్ (12), ఉమర్ (6)గా గుర్తించారు. అదేవిధంగా పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



