పేద మహిళకు జీవన్ జ్యోతి బీమా యోజన భరోసా
– లబ్దిదారురాలుకు రూ. 2లక్షల చెక్కు పంపిణీ
– అందజేసిన ఎస్బీఐ బషీరాబాద్ బ్రాంచ్ మేనేజర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ నిరుపేద మహిళకు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేబీవై) పథకం భరోసా అందించింది. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ లోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) శాఖ ద్వారా బీమా చెల్లిస్తున్న లబ్దిదారుని కుటుంబానికి రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. వివరాల్లోకి వెళితే… బ్యాంకుల్లో ఉన్న ఖాతా ఉన్న లబ్దిదారుల కోసం కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో బీమా నమోదు చేసుకున్న ఖాతా దారుల నుంచి సంవత్సరానికి రూ. 436 లను స్వీకరిస్తుంది. పథకంలో చేరి మరణించిన వారి కుటుంబంలో నామినికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. ఇందులో భాగంగా బషీరాబాద్ మండలంలోని దామర్ చెడ్ గ్రామానికి చెందిన ఎన్.రాజ్ కుమార్ బషీరాబాద్ ఎస్బీఐ బ్యాంకు శాఖలో పీఏంజేజేబీవై పథకం కింద బీమా నమోదు చేయించారు. ఇందులో నామినీగా అతని భార్య భారతమ్మను ఉంచారు. ఇటీవల రాజ్ కుమార్ మరణించారు. దీంతో బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ వెంకట రమణరాజు లబ్దిదారురాలు భారతమ్మకు మంగళవారం రూ. 2 లక్షల బీమా ప్రీమియం చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ భరత్, ట్రైనీ ఆఫీసర్ నాగేందర్ రెడ్డి, హెడ్ క్యాషియర్ లక్ష్మణ్ శరత్, క్లర్క్ ఎం.బాలకృష్ణ, హెడ్ మెస్సెంజర్ మహమ్మద్ మక్సూద్, గార్డు కె.హరిదాస్లు పాల్గొన్నారు.



