వెల్లివిరిసిన మతసామరస్యం
– గణేషునికి స్వాగతం పలికిన ముస్లిం సోదరులు
– వినాయక నిమజ్జనంలో ఆసక్తికర దృశ్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో ఆదివారం జరిగిన వినాయక నిమజ్జనంలో మతసామరస్యం వెల్లివిరిసింది. నిమజ్జనానికి తరలివెళుతున్న వినాయకునికి ముస్లిం సొదరులు స్వాగతం పలికారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరు గడీ వద్ద ఆసక్తికర దృశ్యం కనిపించింది. ప్రతి యేడాది పాత తాండూరు నుంచి వినాయకుని నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ సారి కూడ అట్టహాసంగా ప్రారంభమయ్యింది.

ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కూడ హాజరయ్యారు. గడి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుల నిమజ్జన స్వాగత స్టేజీ వద్ద జిల్లా ఎస్పీతో పాటు స్థానిక మైనార్టీ పెద్దలు కూడ పాల్పంచుకున్నారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో పాటు మైనార్టీ సోదరులు వినాయకునికి పూలు చల్లి మత సామరస్యతను చాటుకున్నారు. నిమజ్జన వేడుకలలో సోదర భావాన్ని చాటడం పట్ల ఎస్పీ కోటిరెడ్డి హిందువులు, ముస్లింలను అభినందించారు.


