విస్తరణకు సై..!
– సమ్మతిస్తున్న వ్యాపారులు, యజమానులు
– వేగిరంగా నేషనల్ హైవే పనులు
– పనులను పరిశీలించిన టీఆర్ఎస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: జిల్లాలో వ్యాపారంగంలో అగ్రస్థానంలో ఉన్న తాండూరు పట్టణంలో రోడ్డు విస్తరణకు అందరు సమ్మతిస్తున్నారు. దీంతో పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు ఊపందుకున్నాయి. రూ. 27 కోట్లతో తాండూరు మీదుగా నేషనల్ హైవే 163కు లింకు రోడ్డు మంజూ దురైన విషయం తెలిసిందే. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చొరవతో సాధించుకున్న రోడ్డు పనులకు అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా రోడ్డు మరమ్మత్తులు జోరుగా జరుగుతున్నాయి. ఇందిరా చౌరస్తా నుంచి గౌతాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపు సైడ్ డ్రైన్ పనుల కోసం రోడ్డు విస్తరణ చేపడుతున్నారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలు, అవసాల తొలగింపుకు యజమానులు, వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. శనివారం ఇందిరా చౌరస్తా నుంచి చించొల్లి రోడ్డు వైపు ఉన్న నిర్మాణాలను తొలగించారు. ఈ తొలగింపు పనులను టీఆర్ఎస్(బీఆర్ఎస్) పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులు నర్సిరెడ్డి తదితరులు పరిశీలించారు. విస్తరణకు సహకరించడం పట్ల అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

