కౌంటింగ్‌ టెన్షన్‌..!

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

chai jr
కౌంటింగ్‌ టెన్షన్‌..!
– విన్నింగ్‌పై 24 గంటల ఉత్కంఠ
– కాంగ్రెస్‌, బీజేపీల గెలుపు ధీమా
– ఇక ఆ పార్టీ ఓట్ల సత్తాపై చర్చ
– వికారాబాద్‌, తాండూరుకు ఎన్ని రౌండ్లు అంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి: పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల వెల్లడయ్యే సమయం వచ్చేసింది. చేవేళ్లలో గెలుపు ఎవరిది అనే ఉత్కంఠకు మరో 24 గంటలలో తెరపడిపోతోంది. గత నెలలో చేవేళ్ల పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీలతో పాటు మొత్తం 43 మంది అభ్యర్థులు పోటీ చేశారు. గత నెల 13న పోలింగ్ జరిగింది. అదే రోజు తాండూరు, వికారాబాద్‌ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం, వీవీ ప్యాడ్‌లను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. సుమారు 22 రోజుల తరువాత కౌంటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కాంగ్రెస్, బీజేపీల గెలుపు దీమా
చేవేళ్ల లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు బరిలో నిలిచాయి. మొదటి నుంచి కాంగ్రెస్, బీజేపీ మద్య పోటాపోటీ ఏర్పడింది. దీనికి తగ్గట్టుగా బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలకు ధీటుగా సిద్దమయ్యింది. ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీలు విస్తృతంగా పనిచేశాయి. కాని కాంగ్రెస్, బీజేపీలు ముందు వరుసలో ఉన్నాయి. పోలింగ్‌కు ముందే బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తేయడంతో కాంగ్రెస్, బీజేపీలకు గెలుపుపై ధీమా పెరిగింది. రేపు జరగుతున్న కౌటింగ్‌లో తమ పార్టీ గెలుస్తోందని కాంగ్రెస్, బీజేపీలు ధీమాతో ఉన్నాయి.

బీఆర్ఎస్‌ ఓట్లపై ఆసక్తి
పార్లమెంట్ ఎన్నికల్లో ఆచీ తూచీ అడుగులు వేసిన బీఆర్ఎస్ పార్టీ కౌంటింగ్‌పై అట్రాక్షన్‌గా నిలిచింది. ఎన్నికలకు ముందు పార్టీ అభ్యర్థులపై తర్జన భర్జన నెలకొన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్‌ను బరిలొ నిలిపారు.

కాంగ్రెస్, బీజేపీల మద్య పోరుతో పాటు బీఆర్ఎస్ పార్టీపై ఉన్న అభిమానంతో ఎన్నికల్లో గెలుపు సాధిస్తుందని మొదట్లో ధీమాలో ఉన్నారు. అందుకు తగినట్లు ప్రచారం కూడా జోరుగా చేశారు. వికారాబాద్‌ జిల్లాతో పాటు తాండూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు హోరెత్తించే ప్రచారం చేశారు. మాజీ మంత్రి సబితారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. తీరా పోలింగ్‌కు ముందు పరిస్థితి తారు మారు అయ్యింది. అయినా కూడా కాంగ్రెస్, బీజేపీ ఓట్లను చీల్చి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఓట్లను రాబడుతోందని సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కౌంటింగ్ ఏర్పాట్లు
కట్టుదిట్టమైన భద్రత మధ్య అత్యంత పకడ్బందీగా చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని, ఇందుకోసం ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశాంక తెలిపారు. లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే మినహా, మధ్యాహ్నం మూడు గంటల వరకు తుది ఫలితం వెలువడే అవకాశం లేకపోలేదని చెప్పారు.

చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామ శివారులోని బండారి శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. మహేశ్వరం నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని బ్లాక్‌ బిలోని 1వ అంతస్తులో, రాజేంద్రనగర్‌ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు బ్లాక్‌ ఎలోని 2వ అంతస్తులో, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఓట్ల లెక్కిపు బ్లాక్‌ బిలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో, చేవెళ్ల నియోజకవర్గం ఓట్ల లెక్కింపు బ్లాక్‌ ఎలోని 1వ అంతస్తులో, పరిగి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు బ్లాక్‌ బిలోని 2వ అంతస్తులో, వికారాబాద్‌ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు బ్లాక్‌ బిలోని 2వ అంతస్తులో, తాండూరు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు బ్లాక్‌ బిలోని 3వ అంతస్తులో కొనసాగుతుంది. అదే విధంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ బ్లాక్‌ ఎలోని 1వ అంతస్తులో కొనసాగుతుంది.

ఇదికూడా చదవండి…

తాగిన మైకంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య