సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
– ఎల్ఓసీలను అందజేసిన టీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎం సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) పథకం పేదలకు వరంగా మారిందని తాండూరు టీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సహాకారంతో తాండూరు మున్సిపల్ పరిధిలోని 6, 8, 29వ వార్డులకు చెందిన కిష్టప్ప, ఫహీమా, లక్ష్మిలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 1లక్ష 38 వేల విలువైన ఎల్ఓసీలు మంజూరయ్యాయి. దీంతో మంగళవారం టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మున్సిపల్ కౌన్సిలర్ల సమక్షంలో లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎం సహాయ నిధి పథకం కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఈ పథకం పేదలకు వరంగా నిలుస్తోందని అన్నారు. అర్హులైన పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అబ్దుల్ రజాక్, బోయరవి, నాయకులు మసూద్, మన్మోహన్ సార్డా తదితరులు ఉన్నారు.

