వచ్చే చలి గాలులు డేంజర్..!
– మూడు రోజులు తగ్గనున్న ఉష్ణోగ్రతలు
– అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక
– ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
హైదరాబాద్, దర్శని ప్రతినిధి: రానున్న మూడు రోజులు చలి గాలులు ప్రమాదకర స్థాయిలో వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వచ్చే మూడు రోజుల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. చలిగాలుల దూకుడుతో హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్, కామారెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. గురువారం రోజు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, వెచ్చని దుస్తులు ధరించాలని సూచించింది.

